ఎస్సై లక్ష్మణ్ పై క్రమశిక్షణ చర్యలు

పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలు

వాట్పల్లి , సెప్టెంబర్ 09 (డైలీ రిపోర్ట్):

తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల తీరుపై తరుచూ విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు కొందరు పోలీస్ అధికారులు. తాజాగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి పుట్టిన రోజు వేడుకలను పోలీస్ స్టేషన్‌లో నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

 

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే

ఆందోల్ నియోజకవర్గం వట్‌పల్లి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వట్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రమేష్ జోషి పుట్టిన రోజు వేడుకలను ఠాణాలోనే నిర్వహించారు. వట్‌పల్లి ఎస్సై లక్ష్మణ్, కానిస్టేబుల్స్ అందరూ కేక్ కట్ చేసి.. రమేష్ జోషికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు.

ఐజీ సీరియస్..

పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై.. హైదారాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. వట్‌పల్లి ఎస్సై లక్ష్మణ్‌పై బదిలీ వేటు వేశారు. వట్‌పల్లి ఎస్సైని విఆర్‌కు పంపించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పాత్ర పై విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో సిబ్బందిలో భయం మొదలైంది. ఈ ఇష్యూ ఇప్పుడు ఆందోల్ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

కేక్ కట్ చేసిన ఏసీపీ..

ఇటీవల మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్.. కాంగ్రెస్ లీడర్లతో కలిసి కేక్ కట్ చేశారు. ఆయనతో పాటు సీఐ, సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి వేడుకల్లో పాల్గొనవచ్చా అని సోషల్ మీడియా వేదికగా డీజీపీని ప్రశ్నిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు