రాజన్నసిరిసిల్ల జిల్లా : జిల్లాలోని వేములవాడ సమీపాన బోయినిపల్లి వెళ్లే మార్గంలో స్తంభంపల్లి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న గంజి వాగు బ్రిడ్జి పని ఏడాది క్రితం ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయింది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో స్తంభంపల్లి, గుండనపల్లి, ఇతర గ్రామాల ప్రజలు, ముఖ్యంగా బోయిన్పల్లి మండల కేంద్రానికి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్నపాటి వాణిజ్య వాహనాలు ప్రమాదాల మధ్య ఈ వాగు గుండా ప్రయాణించాల్సి వస్తోంది. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. వాగు వరద నీటితో ముంచెత్తినప్పుడు ప్రజలు పొరుగు గ్రామాల ద్వారా తిప్పలు పడుతూ గమ్యస్థానాలకు చేరవలసి వస్తోంది. స్థానికులు అనేకసార్లు అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరినా, ఈ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.ఈ సందర్భంగా మండల సిపిఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, “ఇది అభివృద్ధి పట్ల ప్రభుత్వ దృష్టికేంద్రంలేని తీరుని చూపుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆపాలి. ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులను పునఃప్రారంభించాలి” అంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను కుదించి, బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
