హుజురాబాద్ జూన్ 9 : హుజురాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ బిజెపి జిల్లా శాఖ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. హుజురాబాద్ లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన మైదానం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా గత బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి ప్రాంతంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి, ఆ వాగ్దానాన్ని అమలు చేయలేకపోయాయని తెలిపారు. హుజురాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు కోసం కాలేజీ గ్రౌండ్, హై స్కూల్ గ్రౌండ్ లు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ ప్రాంతాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ మండల అధ్యక్షులు రాముల కుమార్, తూర్పాటి రాజు, సంపెల్లి సంపత్ రావు, కొలగాని రాజు, బైరెడ్డి రమణారెడ్డి, ర్యాకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
