మంచిర్యాల జూన్ 12 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు కనీస నిబంధనలు పాటించడం లేదు. పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కొందరు గల్లీకో పాఠశాలలను నెలకొల్పుతూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నారు. అనుమతులు రాకముందే కొన్ని ప్రారంభిస్తున్నారు. విద్యాశాఖ సమయసారిణిని విస్మరిస్తూ తరగతులు కొనసాగిస్తున్న తీరుపై విమర్శలున్నాయి. కళ్లెదుటే తంతు సాగుతున్నా.. అటువైపు చూడకపోవడం, తనిఖీలు చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పాఠశాలలో కనిపించని కనీస ప్రమాణాలు పాఠశాల ఏర్పాటు చేయాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. ఏ పేరుతో అనుమతి తీసుకుంటారో దానినే బోర్డు, కరపత్రాలపై ముద్రించాలి. టెక్నో, ఈ టెక్నో, ప్రైమ్ వంటి పేర్లు జోడించి ప్రచారం చేయడంతోపాటు బోర్డులపై ఏర్పాటు చేస్తున్నారు. గాలి, వెలుతురు వచ్చేలా విశాలమైన తరగతి గదులు, పిల్లలు కూర్చొనేందుకు వీలుగా బెంచీలు, క్రీడల కోసం మైదానాలు, అగ్నిమాపక శాఖ అనుమతి, అగ్నిమాపక పరికరాలు, తదితర సౌకర్యాలు కల్పించాలి. కొన్ని విద్యాలయాలు కనీస ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఇరుకైన గదులు, దుకాణ, ఇళ్ల సముదాయాలు వంటి వాటిలో తరగతులు నిర్వహిస్తున్నారు. మైదానాలు వేరే చోట లీజుకు తీసుకున్నట్లు చూపిస్తున్నారు. రోజువారీ ఆటలకు పిల్లలు దూరమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అధికారికంగా కొనసాగుతున్న బడులే 205 ఉండగా, అనధికారికంగా మరో 40కి పైగా ఉంటాయి. ప్రస్తుతలు రోజుల్లో స్థానికత కోసం పిల్లలకు బోనఫైడ్ ధ్రువపత్రాలు లభించక విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి..
యూనిఫాం లకు వేళల్లో వసూలు….
తమకు దక్కని ఫలితాలను పిల్లలకైనా దరిచేర్చాలని.. ఇంటి చుట్టు పక్కల వారు ప్రైవేటుకు వెళ్తుంటే తామెందుకు చేర్పించొద్దని మరికొందరు.. ఇలా ఎంతో మంది తల్లిదండ్రులు ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. తీరా అక్కడ ప్రవేశం పొందాలంటే చెప్పే ఫీజులు దడ పుట్టిస్తున్నాయి. ప్రవేశ రుసుముతోపాటు వివిధ కోర్సులు నేర్పిస్తామని నర్సరీ నుంచి పదో తరగతి వరకు రూ. వేలల్లో రుసుములు వసూలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణకు ఓ కమిటీ ఉండాలి. ఇది ఏ జిల్లాలోనూ ఏర్పాటు చేయలేదు. యూనిఫాం, ప్రత్యేకంగా ఒక రోజు మరో జత, రెండు రకాల బూట్లు, బెల్టు, టై, పాఠ్య, రాత పుస్తకాలు విద్యాలయాల్లో, తమకు అనుసంధానంగా ఉన్న స్టాల్లోనే కొనుగోలు చేయాలని చెబుతుండడంతో వాటికి అడ్డగోలుగా రూ. వేలల్లో అవుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి బడులపై పర్యవేక్షణ చేపడితేనే పిల్లలకు మేలు జరగడంతోపాటు తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందు తీరనున్నాయి.