వేములవాడలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

జూన్ 19 రాజన్నసిరిసిల్ల జిల్లా : వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి వేములవాడ రాజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. దేశంలోని అసమానతలు రూపుమాపేందుకు అయన ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా పాదయాత్ర నిర్వహించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ, ముంబై నుండి మేఘాలయ వరకు పాదయాత్ర చేస్తూ పేద ప్రజల జీవితాలను దగ్గరగా గమనించారు” అని తెలిపారు. రాహుల్ గాంధీ గత శాసనసభ ఎన్నికల నాటికి వేములవాడ నియోజకవర్గాన్ని రెండు సార్లు సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. “మేడిపల్లి మండల కేంద్రంలో రోడ్ షో, వేములవాడ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, నా గెలుపు కోసం, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ప్రజలను చైతన్య పరచారు” అని పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ…”రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. దేశంలోని కుల అసమానతలు తొలగించేందుకు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్న సంకల్పాన్ని ప్రకటించారు. దానికి అనుగుణంగా తెలంగాణలో కుల గణన ప్రారంభించాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో రాహుల్ నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు